.భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో వాలంటీర్లకు దసరా పండుగ రోజు శుభవార్త.. వినే అవకాశం!…చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం, మంత్రి ఫుల్ క్లారిటీ!
ఇవాళ ఆధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం
వాలంటీర్ల వ్యవస్థపై నిర్ణయానికి ఛాన్స్
పలు కీలక అంశాలపై చర్చించనున్నారు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశంకాబోతోంది. ఇవాళ ఉదయం అమరావతిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన వివిధ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపుపై కేబినెట్ నిర్ణయించే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై.. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణకు కేబినెట్ ముందుకు రానున్న ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
కొత్త పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. దేవాలయాల్లో ఛైర్మన్ సహా 17 మంది పాలక మండలి సభ్యుల నియామకానికి ఓకే చెప్పనున్నారు. రూ.5లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 1200 పైచిలుకు దేవాలయాల్లో ఈ నియామకాలు చేపట్టాలని ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర శాసనసభ నిర్వహణ, ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై చర్చించే అవకాశం ఉంది. మల్లవల్లి పారిశ్రామిక పార్కులో భూ కేటాయింపుల విషయమై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
మరోవైపు ఇవాళ జరగబోయే కేబినెట్ భేటీలో రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్ల గురించి నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి వాసంశెట్టి సుభాష్. వాలంటీర్ల వ్యవస్థ కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.. మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు గ్రామ, వార్డు వాలంటీర్ల కొనసాగింపుపై ఇశాళ జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా వారికి రూ.10,000 జీతం పెంచి విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నట్లు సమాచారం. మొత్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉండగా, ఎన్నికల టైమ్ లో 1.09 లక్షల మంది రాజీనామా చేశారు.. రాజీనామా చేసిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.
వాలంటీర్ల సేవలు ఎలా వినియోగించుకోవాలో కసరత్తు చేస్తున్నామని సీఎం , మంత్రులు అన్నారు. తాజా కేబినెట్ సమావేశంలో వాలంటీర్ల అంశంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు