.భారత్ న్యూస్ అమరావతి..పత్తి చేలల్లో.. వాడిపోతున్న పసిమొగ్గలు
– గుజరాత్లో అంధకారమవుతున్న బాలల భవితవ్యం
– ఎనిమిదేండ్లకే స్కూళ్ల నుంచి పంట పొలాల్లోకి
– రూ. 200 కోసం కూలీలుగా గిరిజన పిల్లలు
– అందులో రూ. 50 రవాణా చార్జీలకు
– పిల్లల భవితను కబళిస్తున్న పేదరికం
– నిస్సహాయులుగా అధికారులు
– గుజరాత్ పత్తి చేనుల్లో బాలకార్మికులుగా నాలుగు జిల్లాల గిరిజన పిల్లలు
– రోజు కూలి రూ. 200, రూ. 50 వాహన చార్జీలకే
– పనిలో 1,50,000 బాల కార్మికులు, 1,90,000 కౌమార పిల్లలు
– సాగుదారులకు కలిసి వస్తున్న గిరిజనుల పేదరికం
‘రెండేండ్ల క్రితం నేను స్కూల్కు వెళ్లేదాన్ని. యేటా రెండు నెలలు మాత్రమే పనికి వచ్చేదాన్ని. కానీ, మా నాన్న అనారోగ్యంతో మంచం పట్టాడు. నన్ను మొత్తం పనికే రమ్మని అమ్మ చెప్పింది. ఇంటికి కొంత డబ్బు అందిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది’ పత్తి చేనులో పని ముగించుకుని బండిలో ఇంటికి తిరిగి వెళ్లడానికి సిద్ధమవుతున్న 12 ఏండ్ల గిరిజన బాలిక కోకిలా చెప్పిన మాటలివి. ‘నేను నా పిల్లలను స్కూల్కు పంపించాలనే అనుకున్నా.
కానీ, ఆ ప్రభుత్వ హైస్కూల్లో నలుగురు టీచర్లు మాత్రమే ఉన్నారు. పిల్లలను స్కూల్కు పంపినా నేర్చుకునేది పెద్దగా ఏమీ ఉండదు. పనికి తీసుకు వచ్చింది బెటర్ అని అనుకున్నా’.. పిల్లలను తన వెంటే పత్తి చేనులో పనికి తీసుకువచ్చిన ఓ గిరిజన తండ్రి అభిప్రాయమిది.
న్యూఢిల్లీ: మన దేశంలో పత్తి ఉత్పత్తి దారుల్లో అగ్రశ్రేణిలో ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ ఒకటి. ఇక్కడ 26.8 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేస్తారు. ఈ సాగులో పనికి ఉత్తర గుజరాత్, దక్షిణ రాజస్తాన్ మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర గుజరాత్ జిల్లాల్లోని పత్తి సాగులో పని చేయడానికి రాజస్తాన్ దక్షిణాది జిల్లాలైన ఉదరు పూర్, దుంగర్పూర్, ఉత్తర గుజరాత్ బనస్కాంత, సబర్కాంత జిల్లాల గిరిజనులు కుటుంబాలుగా వచ్చి కూలి చేసుకుని తిరిగి వెళ్తుంటాయి.
ఉత్తర గుజరాత్లోని పత్తి చేనుల్లో పని చేసే మొత్తం కార్మిక శక్తిలో కేవలం ఉదరుపూర్ నుంచి వచ్చే బాలలు 12.20 శాతం మంది, కౌమారదశ పిల్లలు19.75 శాతంగా డెవలప్మెంట్స్ ఫర్గాటెన్ చిల్డ్రన్ తన 2019 నివేదికలో పేర్కొంది. కోట్రా, ఝాడలో, లసాదియా, సాలుంబర్, సారడ, ఖేర్వాడా, రిషబ్దేవ్, గోగుందా వంటి గిరిజన ప్రాంతాల నుంచి ఎక్కువ వలస కూలీలగా గుజరాత్కు వస్తున్నారు. పైన పేర్కొన్న నాలుగు జిల్లాల నుంచే 70 శాతం కార్మికులు గుజరాత్లో పత్తి సాగుకు పని చేస్తున్నారు. ఇందులో 1,25,000 బాలలు, 1,90,000 కౌమార పిల్లలు కార్మికులుగా ఉన్నారు.
రోజుకు మిగిలేది రూ. 150
ఈ కూలీల్లో పిల్లలు కూడా ఎక్కువగా ఉంటున్నారు. వారు పత్తి సాగులో అన్ని పనులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ పాలినేషన్ కోసం వీరిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పాలినేషన్ ప్రక్రియలో మేల్ ఫ్లవర్ బడ్ను ఫీమేల్ ఫ్లవర్ ప్లాంట్ దగ్గరికి ఒక రోజులో చాలా సార్లు తీసుకురావాల్సి ఉంటుంది. ఆ పత్తి చెట్టు నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతుంది. కాబట్టి, ఈ పనికి పిల్లలు పర్ఫెక్ట్ అని భావిస్తారు. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు.
పత్తి సాగు కోసం పిల్లలను మధ్య దళారీలు చేనులకు తీసుకువస్తారు. లేదా గిరిజనులే తెలుసుకుని వస్తారు. అలా కుదరకపోతే ఇంటి వద్దే సాగు పనులు చేసుకుంటారు. ఉదయం 5 గంటలకు వీరి పని మొదలవుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పని ముగించుకుని వాహనాల్లో ఇంటికి తిరిగి వెళ్లిపోతారు. వీరి కూలి రూ. 200. ఇందులో రూ. 50 వాహన చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది.
అడ్డుకోలేరా?
స్కూల్ డ్రాపౌట్లను తగ్గించడానికి, బాల కార్మికులుగా బాలలు మగ్గడాన్ని అడ్డుకోవడానికి ఇక్కడ ప్రయత్నాలు పెద్దగా లేవని చెప్పొచ్చు. బాల కార్మికుల గురించి ఉదరుపూర్ జిల్లా మెజిస్ట్రేట్ దష్టికి తీసుకెళ్లగా.. గిరిజన పిల్లలు సాగులో ముఖ్యంగా పత్తి సాగులో ఎక్కువగా పనికి వెళ్తున్నారనే విషయం తమ దష్టికి వచ్చిందని, కానీ, తమకు ఎవరూ ఫిర్యాదు చేయడం లేదని తెలిపారు. తల్లిదండ్రులే పిల్లలను తమ వెంట తీసుకెళ్లుతుండటం వల్ల రిపోర్ట్ చేయడానికి ముందుకు రావడం లేదని వివరించారు. పోలీసులు ఆ వాహనాలను అడ్డుకునే ప్రయత్నాలు చేసి..
పలుచోట్ల చెక్ పోస్టులు పెడితే వారు వేరే మార్గాల గుండా వెళ్తున్నారు. పోలీసుల ప్రయత్నాలు ముమ్మరమైనప్పుడు గుజరాత్లోని పత్తిసాగుదారులే ఈ గిరిజనులను వారి దగ్గర పత్తి సాగు చేయాలని కోరుతారు. అప్పుడు గిరిజనులు కుటుంబమంతా కలిసి పంట పొలం వద్దే ఉంటారు. నిర్దిష్ట సమయం అనేది లేకుండా కుటుంబమంతా పనిలోనే నిమగమై ఉంటుంది.
పరిష్కారమేంటీ?
రాజస్థాన్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ధ్రువ్ కుమార కావ్య …