19 నకిలీ బుల్లెట్లు

భారత్ న్యూస్ విజయవాడ…అంతా ఉత్తుత్తి బొమ్మలాట..!

ఆది నకిలీ బంగారం దందా

10 మంది ముఠా పట్టివేత

రెండు కార్లు..

రెండు నకిలీ పిస్తోళ్లు..

19 నకిలీ బుల్లెట్లు

రెండు కిలోల నకిలీ బంగారు పూసల దండ

వాకీ..టాకీ, మైకు స్వాధీనం

కష్టపడకుండా లక్షలకు లక్షలు దోచుకునేందుకు ఓ ముఠా జనం మీదకు పడితే.. యూట్యూబ్ చానల్లో లక్షలకు లక్షల వ్యూస్ కొల్లగొట్టి లక్షలకు పడగలెత్తాలని మరో ముఠా సిద్ధ పడింది. ఈ రెండు ముఠాలు రాయలసీమలో ఉత్తుత్తి తుపాకులతో .. క్రైమ్ సీన్ క్రియేట్ చేసి జనాన్ని బేంబేత్తించి.. కడకు ఊసలు లెక్క పెట్టటానికి శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలో నాలుగు రోజుల కిందట చోటు చేసుకున్న దొంగాపోలీసుల ఆట మిస్టరీ గుట్టను ధర్మవరం పోలీసులు రట్టు చేశారు. ఔను శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురంలో రెండు ముఠాల మధ్య తుపాకీ కాల్పుల మిస్టరీని ధర్మవరం పోలీసులు చేధించారు. నకిలీ బంగారం దందా అసలు గుట్టును రట్టు చేశారు. ఈ కేసులో నకిలీ బంగారం దందాలో రెండు ముఠాలను ధర్మవరం పోలీలసు పట్టుకున్నారు. 10 మందిని అరెస్టు చేశారు. ధర్మవరం పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి.రత్న తెలిపిన వివరాల ప్రకారం, అనంతపురం కదిరి జాతీయ రహదారిపై బత్తలపల్లి మండలం రామాపురం కూడలిలో రెండు ముటాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కేసును జిల్లా ఎస్పీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసు విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ధర్మవరం డీఎస్పి శ్రీనివాసులు నేతృత్వంలో సీఐలు ప్రభాకర్, నాగేంద్రప్రసాద్, రెడ్డప్ప, బత్తలపల్లి ఎస్ఐ నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ ముఠా సభ్యుల కోసం జల్లెడ పట్టారు.

ఈ ఘటనలో హైదరాబాద్ కు చెందిన 8 మంది ముఠా సభ్యులు, అన్నమయ్య జిల్లా షికారి పాలెం గ్రూపునకు చెందిన మరో ఇద్దరు ముఠా సభ్యులను అరెస్టు ఈ దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. జనగామ జిల్లా నార్మెట్ట గ్రామానికి చెందిన పులి అరవింద్ కుమార్ (27) హైదరాబాద్ జగద్గిరీ గుట్టకు చెందిన గుల్ల నాగరాజు (34) , జనగామ జిల్లా మంసానిపల్లి గ్రామానికి చెందిన కీసరి నరేశ్ (31) గద్వాల జిల్లా అయిజ మండలం నౌరోజీ క్యాంప్ నకు చెందిన , జాన్వేష్, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన నవాబ్ పేట సాయి రితీష్ రెడ్డి (23), తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామానికి చెందిన . సంతక సతీష్, ( 23) గుంటూరు జిల్లా కంకర కుంట గ్రామానికి చెందిన షేక్ షంషేర్ ఖాన్ (26) నిజమాబాద్ జిల్లా జేపీ కాలనీకి చెందిన అజోజీ అరవింద్ కుమార్ (22) అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం షికారీ పాళెం గ్రామానికి చెందిన పోమరి బంగారి (32), రాణా హరీష్ (54) ను అరెస్టు చేశారు. షికారి పాళెం గ్రామానికి చెందిన రాణా బాబు రావు అలియాస్ నూర్, వయస్సు (38) , పోమరి విలాస్ అలియాస్ ఇలాచి (28) అనే నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు.

నకిలీ బంగారం దందా ప్లాన్ ఇది

షికారి పాళెం గ్రామానికి చెందిన పొమారి బంగారి, రాణా హరిష్ ,రాణా నూర్ అలియాస్ రాణా బాబు రాజ, పోమరి విలాస్ అలియాస్ ఇలాచి ఓ ముఠాగా ఏర్పడ్డారు. బంగారం ముసుగులో నకిలీ బంగారాన్ని అంటగడుతూ ప్రజలను మోసం చేస్తుంటారు. వీరు తెలంగాణ జనగామ జిల్లా, మానసన్పల్లి గ్రామంలోని నరేశ్ ను సంప్రదించి, రూ.15 లక్షలకు నకిలీ బంగారాన్ని విక్రయించే ఒప్పందం కుదుర్చుకున్నారు. షికారి పాళెం ముఠా నకిలీ బంగారం అమ్మకం గురించి ముందుగానే గ్రహించిన నరేష్, హైదరాబాదుకు చెందిన పులి అరవింద్ కుమార్ అనే వ్యక్తిని సంప్రదించి, పైన పేర్కొన్న ముఠా గురించి సమాచారం ఇచ్చాడు. సైబర్ క్రైమ్ లో ఎథికల్ హ్యాకర్ అరవింద్, తన సహాయకులతో కలిసి రైడ్ ను ప్లాన్ చేసి.. ఇలా నకిలీ బంగారం విక్రయించే ముఠాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి తన “ఎ.కె. సైబర్ న్యూస్ యూట్యూబ్” ఛానెల్లో అప్లోడ్ చేయడానికి ప్లాన్ చేశాడు. ఈ మేరకు ఈనెల 20న సుమారు 09.00 గంటలకు షికారిపాళెం ముఠా, పులి అరవింద్ బృందం రామపురం గ్రామం, బతలపల్లి పీఎస్ సమీపంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఘర్షణ జరగడంతో పులి అరవింద్ సహాయకులు డమ్మీ పిస్టళ్లతో కాల్పులు జరిపారు. ఈ దీంతో ఈ రెండు గ్రూపులు ఘటన స్థలి నుంచి పరారయ్యాయి. ఈ ఘటనకు బొమ్మ తుపాకులను నితీష్ రెడ్డి, జాన్వేష్ హైదరాబాద్ లోని కోటి లో ఒక్కొక్కటి ₹400కి కొనుగోలు చేశారు. ఈ తుపాకులు నిజమైనవిగా కనిపించినప్పటికీ, ధ్వని ప్రభావాలను మాత్రమే ఉత్పత్తి చేశాయి. ప్రాణాంతకం కాదు. ఘర్షణ సమయంలో బాధితులను బెదిరించడానికే ఉపయోగించారు. ఈ కేసులో నిందితుల నుంచి రెండు కార్లు, రెండు నకిలీ తుపాకులు, 19 నకిలీ ప్లాస్టిక్ బుల్లెట్లు సుమారు రెండు కిలోలు ల నకిలీ బంగారు పూసల ఛైను , ఒక వాకీ – టాకీ , ఒక మైకుకు ఈ ముఠా సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ మీడియా సమావేశంలో ఎస్పీ రత్న, ధర్మవరం డీఎస్పి శ్రీనివాసులు, సీఐ లు నాగేంద్ర ప్రసాద్ ప్రభాకర్, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు…